న్యూఢిల్లీ, డిసెంబర్ 12: స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. అవి చేతిలో లేనిదే చాలా మందికి క్షణం గడవటం లేదు. దీంతో ఎంతో మంది స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. కానీ, వాటి వినియోగం అధికమవడం వల్ల మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. ప్రత్యేకించి మన దేశంలో పెండ్లయిన జంటల మధ్య సంబంధాలను స్మార్ట్ఫోన్లు విపరీతంగా దెబ్బతీస్తున్నట్టు స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ‘మానవ సంబంధాలపై స్మార్ట్ఫోన్ల ప్రభావం-2022’ అనే అంశంపై సైబర్ మీడియా రిసెర్చ్ సంస్థతో కలిసి ‘స్విచ్ఛాఫ్’ పేరుతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె నగరాల్లో 1,000 మంది స్మార్ట్ఫోన్ల వినియోగదారులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
జీవిత భాగస్వామితో గడుపుతున్నప్పుడు కూడా స్మార్ట్ఫోన్లలో మునిగి తేలుతున్నట్టు 67% మంది ఈ అధ్యయనంలో అంగీకరించారు.
జీవిత భాగస్వామితో తీరికగా మాట్లాడేందుకు సాధ్యమైన దానికంటే తక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నట్టు 89% మంది తెలిపారు.
జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపాలనుకొంటున్నట్టు 84% మంది వెల్లడించారు.
స్మార్ట్ఫోన్ల వినియోగం అధికమవడం వల్ల తమ జీవిత భాగస్వాములతో సంబంధాలు దెబ్బతింటున్నట్టు 88% మంది అంగీకరించారు.
జీవిత భాగస్వామితో అర్థవంతమైన సంభాషణలు జరిపేందుకు మరింత సమయాన్ని వెచ్చించాలని భావిస్తున్నట్టు 90% మంది చెప్పారు.
ఈ అధ్యయనంలో పాల్గొన్న భర్తలు, భార్యలంతా రోజుకు సగటున 4.7 గంటలపాటు స్మార్ట్ఫోన్లతో గడుపుతున్నట్టు తేలింది.
తనతో గడిపేందుకు సమయాన్ని వెచ్చించకుండా స్మార్ట్ఫోన్లలో మునిగి తేలుతున్నారంటూ తన జీవిత భాగస్వామి ఫిర్యాదు చేసినట్టు 73% మంది అంగీకరించారు.
స్మార్ట్ఫోన్ను ఉపయోగిస్తున్నప్పుడు తన జీవిత భాగస్వామి ఏదైనా అడిగితే చికాకు కలుగుతున్నదని 70% మంది చెప్పారు.