పటియాలా: పంజాబ్లోని పటియాలాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శివసేనకు చెందిన పంజాబ్ విభాగం పంజాబ్ శివసేన (బాల్ ఠాక్రే) శుక్రవారం యాంటీ ఖలిస్థాన్ మార్చ్ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు సిక్కులు, నిహాంగ్స్ మరో ర్యాలీ చేపట్టారు. నగరంలోని కాళీమాత ఆలయం వద్ద రెండు గ్రూపులు ఎదురెదురు పడటంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకొంటూ.. కత్తులు దూసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. ఘర్షణల నేపథ్యంలో శనివారం ఉదయం 6 గంటల వరకు 11 గంటల పాటు జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.
కాగా, పటియాలాలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. తప్పుడు వార్తలను ప్రజలు నమ్మకూడదని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసులు కోరారు. జిల్లా వ్యాప్తంగా భద్రతను పోలీసులు కట్టు దిట్టం చేశారు. కాళీ మందిర్ వద్ద భారీగా బలగాలను మోహరించారు.
Mobile internet services temporarily suspended from 9:30 am to 6 pm in Patiala today: Dept of Home Affairs, Government of Punjab pic.twitter.com/uYu99aECzU
— ANI (@ANI) April 30, 2022
కాగా, పటియాల జిల్లా బంద్కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఖలిస్థానీ మద్దతుదారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఇప్పటికే శివసేనకు చెందిన పంజాబ్ విభాగం పంజాబ్ శివసేన (బాల్ ఠాక్రే) కార్యనిర్వాహక అధ్యక్షుడు హరీశ్ సింగ్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.