Manipur | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): మణిపూర్లో చెలరేగిన హింసను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసి ఆదివారానికి 100 రోజులు కావస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచార వ్యాప్తి, వదంతులను అడ్డుకునేందుకు, శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ఈ చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నది. అయితే ఇంటర్నెట్ సౌకర్యం లేక ప్రజలు వాస్తవాలు తెలుసుకోలేక పోతున్నారని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్(ఐఎఫ్ఎఫ్) సంస్థ వాదిస్తున్నది. మణిపూర్ పౌరుల ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ షట్డౌన్తో తప్పుడు సమాచారమే ఎక్కువగా ప్రచారమవుతున్నదని ‘రిసెర్చ్ అండ్ అడ్వకెసీ ఆర్గనైజేషన్’ అభిప్రాయపడింది.
ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా పునరుద్ధరించినా..ఇది ప్రజల అవసరాలను తీర్చలేకపోయిందని పేర్కొంది. సవరించిన టెలికం చట్టం ప్రకారం ఇంటర్నెట్ సస్పెన్షన్ ఆర్డర్ పదిహేను రోజులకు మించి అమలులో ఉండకూడదని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఐఎఫ్ఎఫ్ గుర్తుచేసింది. మణిపూర్ ప్రజల ఆరోగ్య సంరక్షణ, విద్య, బ్యాంకింగ్, జీవనోపాధి అంశాలు ప్రభావితం అవుతున్నాయని పేర్కొన్నది. ముఖ్యంగా ఆర్ధిక వ్యవస్థ నష్టపోతున్నదని ఆరోపించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని పేర్కొంది. ఉదాహరణకు గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు తమ హాజరును నమోదుచేయలేక వేతనాలను కోల్పోతున్నారని పేర్కొంది.
ఇంటర్నెట్ సస్పెన్షన్ చేయాలంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటి సమీక్షించాలని, కానీ మణిపూర్లో ఆ రివ్యూ కమిటీ సమీక్షించినట్టు దాఖలాలు లేవని పేర్కొంది. ఇంటర్నెట్ సేవలు రద్దుతో అట్టడుగు వర్గాల గొంతులు మూగబోయాయని, హక్కుల ఉల్లంఘనను గుర్తించే సామర్థ్యం దూరం చేసినట్లవుతున్నదని ఐఎఫ్ఎఫ్ ఆరోపించింది. రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించటంపై మణిపూర్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ‘ఇందుకు సంబంధించి అధికారిక వర్గాలు పలు మార్గాల్ని అన్వేషించాలి. తదుపరి విచారణ తేదీ నాటికి ఓ నివేదికను సమర్పించండి’ అంటూ హైకోర్టు ధర్మాసనం విచారణను ఆగస్టు 31కు వాయిదా వేసింది. మణిపూర్లో మే 3 నుంచి ఇంటర్నెట్ సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మణిపూర్లో కేంద్రం సర్జికల్ దాడులు చేపట్టాలని బీజేపీ మిత్రపక్షం ‘ఎన్పీపీ’ సూచించింది. ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) నాయకుడు రామేశ్వర్సింగ్ మాట్లాడుతూ, ‘అక్రమ వలసదారులు, మిలిటెంట్స్ను వెళ్లగొట్టాలంటే కేంద్రం సర్జికల్ దాడుల వంటి తీవ్ర చర్యల్ని చేపట్టాలి. మణిపూర్ హింసలో విదేశీ శక్తుల కుట్ర దాగివుందని, జాతీయ భద్రతపై రాజీపడుతున్నామని చాలా రోజుల నుంచి మేం చెబుతూనే ఉన్నాం’ అని ఆయన అన్నారు.