చండీగఢ్: హర్యానాలో (Haryana) అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత సోమవారం మేవాట్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో ఆరుగురు చనిపోగా 170 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే మత ఘర్షణలు మరింతగా వ్యాపించే అవకాశం ఉండటంతో అల్లర్లకు కేంద్రమైన నూహ్తోపాటు (Nuh) ఫరీదాబాద్, పల్వాల్, సోహ్నా, పటౌడీ, గురుగ్రామ్లోని మానెసర్లో ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ (mobile internet), ఎస్ఎమ్మెస్ సేవలను (SMS services) నిలిపివేసింది (Suspended). ఇది ఈ నెల 5 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంటి. మత ఘర్షణలను నివారించడానికి, శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికు 116 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కాగా, హర్యానాలోని నుహ్ కేంద్రంగా చెలరేగిన హింసపై సీఎం మనోహర్లాల్ ఖట్టర్ (CM Manohar Lal Khattar) బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరూ హామీ ఇవ్వలేరని, ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ రక్షించలేదంటూ వ్యాఖ్యానించారు. ‘పోలీసులు కానీ ఆర్మీ గానీ ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించలేరు’ అని పేర్కొన్నారు. దీనిపై విలేకర్లు ప్రశ్నించగా.. సీఎం ఖట్టర్ ఆ వెంటనే మాట మార్చారు. తన స్టేట్మెంట్ను తప్పుగా అర్థం చేసుకొన్నారని, ప్రజలకు రక్షణ కల్పించడంలో భద్రతా బలగాలతో పాటు ప్రజల మధ్య సామరస్యం ఉండటం కూడా ముఖ్యమని చెప్పుకొచ్చారు. అల్లర్లలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని తెలిపారు. అల్లరి మూకల నుంచే బాధితులు పరిహారం పొందుతారని ఖట్టర్ అన్నారు.
In order to maintain peace and public order, mobile internet services in the jurisdictions of Nuh, Faridabad and Palwal districts & in the territorial jurisdiction of Sohna, Pataudi and Manesar sub-divisions of Gurugram district will remain suspended till August 5: Haryana Govt pic.twitter.com/N8R9b7zG7J
— ANI (@ANI) August 3, 2023