Pothina Mahesh : విజయవాడ పశ్చిమ టికెట్ దక్కకపోవడంతో జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన పోతిన వెంకట మహేశ్ మరోసారి పవన్ కల్యాణ్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్ నిండా పచ్చి అబద్ధాలు, మోసాల చిట్టా ఉందని అన్నారు. 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాతనే పవన్ కల్యాణ్ ఆస్తులు బాగా కొనుగోలు చేశారని, ఆయనకు సినిమా రంగం కంటే రాజకీయ రంగమే బాగా కలిసొచ్చినట్టుగా అర్థమవుతోందని చెప్పారు.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు బాగా లాభాలు వచ్చాయని, చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజితో ఆస్తులు కొనుగోలు చేసినట్టు స్పష్టమవుతోందని పోతిన మహేశ్ ఆరోపించారు. పవన్ కల్యాణ్ నటించిన గత 4 చిత్రాల్లో రెండు ఫెయిల్ అయ్యాయని, రెండు యావరేజ్గా ఆడాయని అన్నారు. పవన్ అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.90 కోట్లుగా చూపించారని, కానీ మార్కెట్ రేటును ఎక్కడా చూపించలేదని విమర్శించారు. మార్కెట్ రేటు ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.400 నుంచి రూ.450 కోట్లు ఉంటుందని అన్నారు.
పవన్ కళ్యాణ్ విద్యార్హత టెన్త్ క్లాస్ అనేది కూడా వివాదాస్పదమేనని పోతిన మహేశ్ అన్నారు. ఓ ఆస్తి విషయంలో ఆయన గిఫ్ట్ ఫ్రమ్ మదర్ అని రాశారని, మరి వారి తల్లిగారు ఇచ్చారా, దత్తత తల్లి ఇచ్చారా..? అనేది స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. పవన్ ఆదాయం రూ.114 కోట్లు, కట్టిన పన్ను రూ.67 కోట్లు కాగా.. ఇచ్చిన విరాళాలు రూ.20 కోట్లు పోతే మిగిలిన రూ.20 కోట్లతో రూ.90 కోట్ల విలువైన ఆస్తులు ఎలా కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
సినిమాలకు తీసుకున్న అడ్వాన్సులను కూడా అప్పులుగా చూపించిన అపర మేధావి పవన్ కళ్యాణ్ అని పోతిన మహేశ్ అన్నారు. ఆయన ఆర్థిక మోసాలకు పాల్పడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. అందుకే ఆయన అఫిడవిట్ మొత్తాన్ని ఒకసారి ఆదాయ పన్ను అధికారులు తనిఖీ చేయాలన్నారు. తేడా వస్తే శిక్ష కూడా వేయాలని డిమాండ్ చేశారు.