మొదటి పెళ్లి విఫలం అవడంతో కూతురికి మరో పెళ్లి చేశాడా తండ్రి. అదే అతను చేసిన తప్పు. పెళ్లి రిగిన కొన్నిరోజులకే ఒక గుంపు అతని ఇంటిపై దాడి చేసింది. బలవంతంగా ఇంట్లో దూరి అతన్ని చావబాదింది. చివరకు అతని ముక్కు, చెవులు కోసేసి, కాలు విరగ్గొట్టి అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటన రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో వెలుగు చూసింది.
ఆదర్శ్ సోంది గ్రామానికి చెందిన సుఖరాం బిష్ణోయి (55).. తన కుమార్తెకు ఆరేళ్ల క్రితం పెళ్లి చేశాడు. అయితే అక్కడ ఉండలేకపోయిన ఆమె ఏడాది క్రితం ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇంట్లోనే ఉంటున్న కుమార్తెకు మరో సంబంధం చూసి పెళ్లి చేశాడు సుఖరాం. అంతే, కొందరు దుండగులు అతని ఇంటిపై దాడి చేశారు.
సుఖరాం ముక్కు, చెవులు కోసేసి, కాలు విరగ్గొట్టి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సుఖరాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. బిష్ణోయి మాజీ అల్లుడి కుటుంబమే ఈ దాడి చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.