రాంచీ, సెప్టెంబర్ 4: ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే బీజేపీకి బలనిరూపణతో చెక్పెట్టేందుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ సూత్రాన్ని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసి బీజేపీకి షాక్ ఇవ్వగా.. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. అనర్హత వేటు పేరుతో జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రను భగ్నం చేయడంలో భాగంగా సోమవారం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని సొరేన్ నిర్ణయించారు.
బీజేపీ ఉచ్చులో పడకుండా పార్టీ ఎమ్మెల్యేలు, భాగస్వామ్య ఎమ్మెల్యేలను ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉంచిన సొరేన్.. ఆదివారం వారందరినీ రాంచీకి తీసుకొచ్చారు. సోమవారం జరుగనున్న విశ్వాస పరీక్షలో వీరంతా ఓటువేయనున్నారు. తద్వారా తమ ప్రభుత్వాన్ని కూల్చలేరన్న సంకేతాన్ని బీజేపీకి పంపనున్నారు.