బెంగళూరు: రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కర్ణాటకలో అధికార కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. క్రాస్ ఓటింగ్ భయంతో పార్టీ ఎమ్మెల్యేలందరినీ సోమవారం ఒక హోటల్కు తరలించింది. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, బీజేపీ, జేడీఎస్ పార్టీల నుంచి ఒక్కరు చొప్పున పోటీపడుతున్నారు. మంగళవారం ఓటింగ్ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలు తమ శాసనసభ్యులకు విప్ జారీచేశాయి.
అసెంబ్లీలో కాంగ్రెస్కు 134 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి 66, జేడీఎస్కు 19 మంది శాసనసభ్యుల బలం ఉన్నది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్కు మూడు స్థానాలు గెలుచుకొనే బలం ఉండగా.. బీజేపీ-జేడీఎస్ కూటమి ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నది. అయినప్పటికీ రెండో అభ్యర్థిని బరిలో నిలుపడంతో కాంగ్రెస్కు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకొన్నది. నాలుగు స్థానాలకు నలుగురు మాత్రమే బరిలో ఉంటే.. ఒక అభ్యర్థి విజయం సాధించేందుకు 45 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. నలుగురు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న పక్షంలో ప్రాధాన్యతా ఓట్లను పరిగణనలోకి తీసుకొంటారు.