చెన్నై: తమిళ్ను మద్రాస్ హైకోర్టు అధికార భాషగా చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. దీంతో పాటు మరో రెండు డిమాండ్లను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు గురువారం లేఖ రాశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల హైకోర్టుల్లో ఇంగ్లీష్తోపాటు హిందీని కూడా అధికార భాషగా పరిగణిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో ఇంగ్లీష్తోపాటు స్థానిక భాషను అధికార భాషగా చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని అన్నారు. సామాన్యులకు చట్టం అర్థమయ్యేలా చేయడం న్యాయ వ్యవస్థలో ఎంతో అవసరమన్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయమూర్తుల నియామకాల గురించి సీఎం స్టాలిన్ తన లేఖలో ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా సమాజంలోని అన్ని వర్గాల నుంచి ఉన్నత న్యాయ వ్యవస్థలో ప్రాతినిధ్యం తగ్గడాన్ని మనం చూస్తున్నామని తెలిపారు. న్యాయ తీర్పునకు ప్రాథమికమైన ‘వైవిధ్య లోటు’కు ఇది దారితీస్తుందని చెప్పారు.
అలాగే దేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచ్లను ఏర్పాటు చేయాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నదని గుర్తు చేశారు. ధనిక, పేద అన్న బేధం లేకుండా పౌరులందరికీ దేశ అత్యున్నత న్యాయస్థానానికి నేరుగా ప్రవేశం ఉండాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 చెబుతోందన్నారు. అయితే దక్షిణాది వంటి రాష్ట్రాలకు చాలా దూరంగా ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉందన్నారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కును ఆయా రాష్ట్రాల ప్రజలు కోల్పోతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.