కోల్కతా: బీజేపీ నేత మిథున్ చక్రవర్తి మానసిక ఆరోగ్యం సరిగా లేనట్లుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ శాంతాను సేన్ విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో కూడా మహారాష్ట్ర మాదిరి పరిస్థితి ఉందన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ఆయన ఆసుపత్రిలో చేరారని విన్నాను. ఇది శారీరకం కాదు మానసిక వ్యాధి అని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పేది బెంగాల్లో ఎవరూ నమ్మరు’ అని అన్నారు.
కాగా, నటుడి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బీజేపీ నేత మిథున్ చక్రవర్తి మీడియాతో బుధవారం మాట్లాడారు. బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి తమ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇందులో 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో నేరుగా సంప్రదిస్తున్నారని అన్నారు.
‘మీరు బ్రేకింగ్ న్యూస్ వినాలనుకుంటున్నారా? ఈ సమయంలో ఇక్కడ కూర్చొన్న మాతో 38 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. వారిలో 21 మంది ప్రత్యక్షంగా నాతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక మిగతాది మీ అంచనా కోసం మీకే వదిలేస్తున్నా’ అని అన్నారు. మరిన్ని వివరాలను మీడియా కోరగా ‘ట్రైలర్ను విడుదల చేయమని నన్ను అడగవద్దు. సంగీతాన్ని ఆస్వాదించండి’ అని వ్యాఖ్యానించారు