తిరువనంతపురం: ఒక నగరం పేరును తప్పుగా అనువాదం చేశారు. దీంతో ఆ రైలు పేరు మారిపోయింది. ‘మర్డర్ ఎక్స్ప్రెస్’గా పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. (Murder express) చివరకు పొరపాటును గ్రహించిన రైల్వే అధికారులు ఆ రైలు బోర్డుపై ఉన్న పేరును సరిదిద్దారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని హటియా, కేరళలోని ఎర్నాకుళం నగరాల మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు నడుస్తున్నది. అయితే హిందీ పదమైన ‘హటియా’ను మలయాళంలో అనువాదించడంలో తప్పు జరిగింది. హతియా(హంతకుడి)గా భావించి ఆ అర్థం వచ్చేలా ‘కోలపథకం’ అని మలయాళంలో రాశారు. దీంతో హటియా-ఎర్నాకుళం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు కాస్తా ‘మర్డర్ ఎక్స్ప్రెస్’గా మారిపోయింది.
కాగా, ఈ రైలుకు సంబంధించిన నేమ్ బోర్డు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో తప్పుగా అనువాదం చేయడంపై నెటిజన్లు, ముఖ్యంగా కేరళవాసులు మండిపడ్డారు. గూగుల్ ట్రాన్స్లేషన్పై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఇలాంటి గొందరగోళం జరుగుతున్నదని కొందరు విమర్శించారు. మరోవైపు రైల్వే అధికారులు ఈ పొరపాటుపై స్పందించారు. తప్పుడు అనువాదం వల్ల ఇలా జరిగినట్లు చెప్పారు. ఆ రైలు నేమ్ బోర్డును సరిచేసినట్లు వెల్లడించారు.