MIRV | న్యూఢిల్లీ, మార్చి 11: భారత అమ్ములపొదిలో మరో దివ్యాస్త్రం చేరింది. ‘మిషన్ దివ్యాస్త్ర’ పేరుతో ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని 5 క్షిపణిని భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) సోమవారం విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికిల్ (ఎంఐఆర్వీ) టెక్నాలజీతో డీఆర్డీవో అభివృద్ధి చేసింది. అగ్ని 5 క్షిపణి తొలి ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు. తాజా ప్రయోగంతో ఎంఐఆర్వీ సాంకేతికత కలిగిన అగ్రదేశాల సరసన భారత్ చేరింది. ఈ ప్రాజెక్టు హెడ్ ఒక మహిళ అని, ఇందులో అనేక మంది మహిళలు కీలకపాత్ర పోషించారని రక్షణ వర్గాలు వెల్లడించాయి.
అణ్వస్త్ర సామర్థ్యమున్న అగ్ని 5 క్షిపణి 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. చైనాలోని ఉత్తరప్రాంతాలు సహా ఆసియా మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది. యూరప్లోని పలు ప్రాంతాలు కూ డా దీని పరిధిలోకి వస్తాయి. అగ్ని 5 క్షిపణిని డీఆర్డీవో ఇదివరకే అనేకసార్లు పరీక్షించింది. అయితే ఎంఐఆర్వీ సాంకేతికతో పరీక్షించడం ఇదే తొలిసారి. అగ్ని 1 నుంచి అగ్ని-4 క్షిపణులు 700 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. వీటిని ఇప్పటికే సైన్యంలో మోహరించారు.
ఎంఐఆర్వీ టెక్నాలజీతో ఒకే క్షిపణితో బహుళ వార్హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. ఒక క్షిపణి 10 వరకు వార్హెడ్లను మోసుకుపోగలదు. ఈ క్షిపణిలోని వార్హెడ్లను వేర్వేరు దిశల్లో వేర్వేరు వేగాల తో ప్రయోగించవచ్చు. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. పాకిస్థాన్ కూడా ఈ టెక్నాలజీపై ప్రయోగాలు చేస్తున్నది.