Karnataka | బెంగళూరు, మార్చి 11: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మిర్చి రైతులు రోడ్డెక్కారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మిర్చి పంట కొనుగోలు ధరలు గణనీయంగా పడిపోవటంతో సోమవారం హవేరీ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇక్కడి బ్యాదాగి ప్రాంతంలోని ఏపీఎంసీ (మార్కెట్ కమిటీ) భవనంపై కొంతమంది రైతులు రాళ్లదాడి చేశారు. కార్యాలయంలోకి వెళ్లి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఒక ఫైర్ ఇంజిన్ అక్కడకు చేరుకోగా, రైతులు అడ్డుకున్నారు. మార్కెట్ కమిటీ ఆవరణలోని రెండు వాహనాలకు, ఫైర్ ఇంజిన్కు నిప్పు పెట్టారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఓ కానిస్టేబుల్ ఘటనాస్థలికి రాగా, అతడ్ని రైతులు వెంటబడి తరిమేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. కొన్ని గంటల తర్వాత పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలిగారు. మిర్చి పంట కొనుగోలు ధర ఒక్కసారిగా రూ.20 వేల నుంచి రూ.8 వేలకు పడిపోయిందని, రైతుల ఆగ్రహానికి ఇదే కారణమని హోంమంత్రి జీ పరమేశ్వర విలేకరులకు చెప్పారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ నీలప్ప మాట్లాడుతూ, ‘మిర్చి కొనుగోలు ధర రూ.10 వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతులే రాళ్లదాడికి పాల్పడ్డారు’ అని అన్నారు.