Bhopal | మధ్యప్రదేశ్ ఫైర్బ్రాండ్ మంత్రి ఉషా ఠాకూర్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా పెరుగుతన్నా మాస్క్ ఎందుకు ధరించని పలువురు అడగ్గా.. ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. తాను నిత్యాగ్ని హోత్రీకురాలని, నిత్యం అగ్నిని ఆరాధన చేస్తానని పేర్కొన్నారు. తన చుట్టూ ఉన్న పరిసరాలను అగ్ని పునీతం చేస్తుందని, గత 30 సంవత్సరాలుగా నిత్యాగ్నిహోత్రీకురాలినని పేర్కొన్నారు.
అయితే మీడియాతో మాట్లాడే సమయంలో ఆమె ఓ శాలువాను మొహానికి ధరించే ఉన్నారు. ‘గత 30 సంవత్సరాలుగా నిత్యాగ్నిహోత్రీకం చేస్తున్నాను. అగ్నిని ఆరాధిస్తూనే ఉన్నాను. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో నిత్యాగ్నిహోత్రం చేస్తాను. అందుకే నాకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకు వైరస్ నన్నేమీ చేయలేదు’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే కాస్త జలుబు చేస్తుంది కానీ, వైరల్ అటాక్ అంటూ ఏమీ జరగదని ఉషా ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు.