హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక శాఖపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నగరంలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసేందుకు.. తెలంగాణ సంస్కృతి గొప్పదనాన్ని ఆట, పాటల ద్వారా వివరించేందుకు సాంస్కృతిక సారథి కళాకారులకు అవగాహన సదస్సును ఫిబ్రవరి 26న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నామన్నారు.
కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాంస్కృతిక సారథి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి సంబంధిత శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణను ఆదేశించారు. అలాగే కళాకారుల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్కు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాటల రికార్డింగ్ కోసం రికార్డింగ్ స్టూడియోను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కళాకారులను సమన్వయం చేసేందుకు రాష్ట్ర సమాచార శాఖ అధికారులు, కలెక్టర్లు, జిల్లా పౌర సమాచార శాఖ అధికారులు సహకారం అందించుకోవాలని సూచించారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీల ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. పథకాలపై కవులకు, కళాకారులకు, సాహితీవేత్తలకు సమ్మేళనాలను, పోటీలను నిర్వహించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జులూరి గౌరి శంకర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాష్ట్ర సమాచార శాఖ ఉన్నతాధికారులు ఈడీ కిశోర్ బాబు, మధుసూదన్ పాల్గొన్నారు.