న్యూఢిల్లీ : మహబూబ్నగర్ జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డికి, సెక్రెటరీ అరవింద్ సింగ్కు ప్రతిపాదనలను అందజేశారు. గతంలో కూడా కేంద్ర మంత్రిగా ఉన్న ప్రహల్లాద్ సింగ్ పటేల్ను కలిసి ప్రతిపాదనలు అందజేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిలో భాగంగా స్వదేశీ దర్శన్ స్కీంలో చరిత్రాత్మక కోటల సంరక్షణ, మహబూబ్ నగర్ జిల్లాలోని పిలిగ్రీమేజ్ అండ్ నేచర్ టూరిజం సర్క్యూట్ను, ప్రసిద్ధ బుద్ధిజం కేంద్రాల అభివృద్ధి చేయాలని వివరాల్ని అందించారు.
మహబూబ్ నగర్ పట్టణంలో సుమారు రూ. 25 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న కల్చరల్ సెంటర్కు ఠాగూర్ కల్చరల్ కాంప్లెక్స్ స్కీం ద్వారా రూ. 15 కోట్ల ఆర్థిక సహకారాన్ని అందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. అడాప్ట్ ఎ హెరిటేజ్ స్కీంలో ఎంపికైన గోల్కొండ కోట, అలంపూర్ జోగులంబా దేవాలయం, రామప్ప దేవాలయం పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రి కోరారు.
హైదరాబాద్ నగరం ఎంఐసీఈ టూరిజం, మెడికల్ క్యాపిటల్గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (IITTM) క్యాంపస్ను ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన భూమిని ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుందని తెలిపారు. అందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి విజ్ఞప్తి చేశారు.