వీళ్లు.. విశ్వవేదికలపై భారత పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన ఖేల్త్న్రాలు. దేశానికి బంగారు పతకాలు తెచ్చిన బంగారు తల్లులు. గత 12 రోజులుగా వీళ్లు రోడ్డుమీదే ఉన్నారు. న్యాయం కోసం ఢిల్లీ నడివీధిలో నిరసన తెల్పుతున్నారు. వాళ్లేం వరాలు, వజ్రాలు అడగట్లేదు. ఏ నామినేటెడ్ పోస్టునో, ఏ సర్కారీ కొలువునో కోరట్లేదు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ను ఆ పదవి నుంచి తొలగించాలని మాత్రమే అడుగుతున్నరు. తమను లైంగికంగా వేధించిన వ్యక్తిని చట్టంముందు నిలబెట్టాలని మాత్రమే కోరుతున్నరు.
దేశ ప్రజలకు తన ‘మన్కీ బాత్’ చెప్పే ప్రధానికి.. వీరి గోసను, గోడును వినే సమయం లేదు. నిందితుడితో మోదీ ప్రభుత్వం అంటకాగుతూ క్రీడాకారిణులతో కర్కశంగా వ్యవహరిస్తున్నది. కటికనేలపై నిద్రించలేక ఆడబిడ్డలు మడత మంచాలు తెచ్చుకోవడాన్ని కూడా సహించలేక పోయింది. జంతర్మంతర్ నిరసన వేదిక వద్ద ఢిల్లీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. దాడులకు దిగారు. క్రీడాకారిణులతో అనుచితంగా ప్రవర్తించారు. ‘ఇంతలా అవమానపడేందుకేనా మేం అంతర్జాతీయ పతకాలు సాధించింది?’ అంటూ రెజ్లర్లు కన్నీటిపర్యంతం అవుతున్నారు. వారి అశ్రుధార, వారి ఆక్రోశం మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.
‘ఇదేనా బేటీ బచావో?’
‘ఇదేనా ఖేల్ సమ్మాన్?’!
Wrestlers Protest | న్యూఢిల్లీ, మే 4: తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్సింగ్ను కఠినంగా శిక్షించాలని 12 రోజులుగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడులకు పాల్పడ్డారు. రెజ్లర్లు పడుకొనేందుకు మడత మంచాలు తెచ్చుకొన్నారన్న కారణం చూపి బీభత్సం సృష్టించారు. ధర్మేంద్ర అనే పోలీస్ అధికారి ఫుల్లుగా మద్యం తాగి వచ్చి తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకేనా తాము ఎంతో కష్టపడి పతకాలు సాధించింది? అని నిలదీశారు.
బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం కురిసిన వర్షానికి వారు వేసుకొన్న కార్పెట్లు, ఇతర సామగ్రి తడిసిపోయాయి. దీంతో పడుకొనేందుకు మడత మంచాలు తెచ్చుకొన్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది. పోలీసులు దాడులకు పాల్పడటంతో ప్రముఖ రెజ్లర్ భజరంగ్ పూనియా బావమరిది దుష్యంత్తోపాటు రాహుల్ అనే మరో వ్యక్తి తలకు బలమైన గాయాలయ్యాయి. వారికి వైద్యం అందించేందుకు డాక్టర్లను కూడా అక్కడికి రాకుండా పోలీసులు అడ్డుకొన్నారని రెజ్లర్లు ఆరోపించారు.
పోలీసుల గూండాగిరిని సహించేదిలేదని భజరంగ్పూనియా హెచ్చరించారు. ‘ఢిల్లీ పోలీసుల గూండాగిరి ఇక చెల్లదు. మాకు మద్దతుగా రైతులు, సాధారణ పౌరులంతా జంతర్మంతర్కు తరలిరండి. పోలీసుల వ్యవహార శైలిని ఎంతమాత్రం సహించేదిలేదు. ఇది మన ఆడబిడ్డల గౌరవానికి సంబంధించిన విషయం. నేరం చేసిన బ్రిజ్భూషణ్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. మేం మాత్రం నేరస్థుల్లా శిక్షకు గురవుతున్నాం’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పూనియా సతీమణి సంగీత పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన వారిని పోలీసులు అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్ డిమాండ్ చేశారు. కేంద్రం ఆదేశాలతోనే రెజ్లర్ల మద్దతుదారులను అరెస్టు చేశారని ఆరోపించారు. కేంద్రం తీరుతో దేశంలో మరో విప్లవం వస్తుందన్నారు.
న్యూఢిల్లీ, మే 4(నమస్తే, తెలంగాణ): లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న భారత్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గురువారం ఢిల్లీలో రెజ్లర్లను మంత్రి శ్రీనివాస్గౌడ్ కలిసి సంఘీభావం తెలిపారు. రెజ్లర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశానికి పేరు తెచ్చిన రెజ్లర్లు తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. రెజ్లర్లకు సంఘీభావం తెలిపిన వారిలో ఎంపీలు నామా నాగేశ్వర్రావు, రవిచంద్ర, వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సికిందర్ రెడ్డి, జగన్మోహన్, నాగసాయి, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ఢిల్లీ పోలీసుల జులుంపై రెజ్లర్ వినేశ్ ఫొగట్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘ఇలాంటి రోజు చూడటానికే మేం పతకాలు గెలిచామా? మా సొంత ఆహారం కూడా మేం తినలేకపోతున్నాం. మహిళలను వేధించటం ఈ దేశంలో ప్రతి పురుషుడి హక్కా? పోలీసులు మమ్మల్ని చంపాలనుకొంటే వెంటనే చంపేయండి. మహిళలను పురుష పోలీసులు అంత దారుణంగా ఎలా తోసేస్తారు? మేం నేరస్థులం కాము. మద్యం తాగి వచ్చిన ఓ పోలీస్ అధికారి నా సోదరుడిని కొట్టాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
రెజ్లర్లపై పోలీసుల దాడి బీజేపీ అహంకారానికి, పోకిరితనానికి నిదర్శనం. ఆ పార్టీకి అహంకారం తలకెక్కింది. పోకిరి చేష్టలతో వ్యవస్థను నడపాలని భావిస్తున్నది. దేశ ప్రజలందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. బీజేపీ అహంకారాన్ని ఇక ఎంతమాత్రం సహించరాదు. బీజేపీని కూకటివేళ్లతో పెకిలించే సమయం ఆసన్నమైంది.
– అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
ఈ దేశ మహిళా రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసుల ప్రవర్తన అవమానకరం. ప్రధాని మోదీ చెప్పే బేటీ బచావో అనే నినాదం ఉత్త హంబక్. ఈ దేశ ఆడ బిడ్డలపై దారుణాలు చేసేవారికి బీజేపీ ఎన్నడూ దూరంగా ఉండదు.
– రాహుల్గాంధీ, కాంగ్రెస్ నేత