బెంగళూర్ : కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై చెలరేగిన అసమ్మతి చల్లారలేదు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనివార్యమని టూరిజం మంత్రి సీపీ యోగేశ్వర్ స్పష్టంచేశారు. సీఎం కుమారుడు, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్రను అత్యున్నత పదవి చేపట్టేందుకు తాము అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఏనుగు కుమారుడికి (యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర) ఆయన తండ్రి సీఎం అంయినంతమాత్రాన ముఖ్యమంత్రి పీఠం కట్టబెడితే ఊరుకోబోమని పేర్కొన్నారు.
ఆ పదవి కోసం తమలో చాలా మంది ఏనుగులు, పులులు ఉన్నాయని, అత్యున్నత పదవికి ఏ ఏనుగు సరిపోతుందో హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. కాగా హైకమాండ్ ఆశీస్సులు ఉన్నంతవరకూ తాను సీఎం పదవిలో కొనసాగుతానని యడియూరప్ప ఇటీవల వ్యాఖ్యానించారు. అధిష్టానం తనను వద్దని కోరిన రోజున పదవికి రాజీనామా చేసి రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు.