మొన్నటి వరకూ కర్నాటకలో హిజాబ్ గొడవ నడిచింది. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. అదే అజాన్ వివాదం. దీనిపై ఇప్పుడు కర్నాటకలో చర్చ నడుస్తోంది. ముస్లింలను నమాజ్కు ఆహ్వానించే సంప్రదాయమే ఈ అజాన్. మైకుల ద్వారా ప్రార్థనలకు రావాలని పిలిచే పద్ధతే అజాన్.
అజాన్ పై కర్నాటక సీనియర్ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా లౌడ్స్పీకర్ల ద్వారా అజాన్ను ప్రకటించడం ద్వారా విద్యార్థులు బాగా ఇబ్బందిపడుతున్నారని అన్నారు. పిల్లలతో పాటు రోగులు, వృద్ధులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్వార్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఈశ్వరప్ప మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
‘అజాన్ను లౌడ్ స్పీకర్ల ద్వారా వింటున్నాను. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. లౌడ్స్పీకర్ల ద్వారా ప్రార్థనలకు పిలవడం వారిలో చాలా కాలంగా వస్తోన్న సంప్రదాయం. దీని ద్వారా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. రోగులు, వృద్ధులకు కూడా ఇబ్బందే. వారి పిల్లలకూ ఓ ఇబ్బందే. లౌడ్ స్పీకర్లతో ముస్లింలు అజాన్కు ఆహ్వానించడం, హిందువులు లౌడ్ స్పీకర్ల ద్వారా హనుమాన్ చాలీసాలు పెట్టడం.. ఇలా వ్యవహారం పోటాపోటీగా మారకూడదు. అజాన్ వల్ల వారి పిల్లలకు కూడా ఇబ్బందే. లౌడ్ స్పీకర్లను నిషేధించాలన్న దానిపై నా దృష్టి కోణం ఇదే’ అంటూ ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు.