తనపై కాంట్రాక్టర్ సంతోశ్ చేసిన ఆరోపణలపై మంత్రి ఈశ్వరప్ప బుధవారం స్పందించారు. అసలు తాను కాంట్రాక్టర్ సంతోశ్ను ఎప్పుడూ చూడలేదని, ఆయనను ఎప్పుడు కలుసుకోనూ లేదని ఈశ్వరప్ప స్పష్టం చేశారు. ‘నేనెప్పుడూ కాంట్రాక్టర్ సంతోశ్ను చూడలేదు. కేంద్రానికి అతను రాసిన లేఖను మా శాఖ పరిశీలనకు వచ్చింది. దీనిపై మా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అతీఖ్ అహ్మద్ సమాధానమిచ్చారు. ఆయనకు సివిల్ కాంట్రాక్ట్ పనులు అప్పగించినట్లు మా రికార్డుల్లో లేవు. అలాంటప్పుడు నగదు చెల్లింపుల సమస్యే ఉత్పన్నం కాదు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా మేం తీసుకెళ్లాం’ అని మంత్రి ఈశ్వరప్ప వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని సీఎం బొమ్మైని, హోంమంత్రిని విజ్ఞప్తి చేశాను అని మంత్రి ఈశ్వరప్ప వివరణ ఇచ్చారు.
తన మృతికి మంత్రి ఈశ్వరప్పే కారణమంటూ కాంట్రాక్టర్ సంతోశ్ పాటిల్ సూసైడ్ నోట్ రాశారు. మంత్రి ఈశ్వరప్ప తనను 40 శాతం కమీషన్ అడిగారని, అది కట్టలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని కాంట్రాక్టర్ తన సూసైడ్ నోట్లో రాసుకున్నారు. ఈశ్వరప్పే తన మృతికి కారణమని, ఆయనను కచ్చితంగా శిక్షించాలని కోరారు. తన కోరికలన్నింటినీ చంపుకొని, ఆత్మహత్యకు ఒడిగడుతున్నానని, తన కుటుంబ యోగక్షేమాలు ప్రధాని, యడియూరప్ప, సీఎం చూసుకోవాలని ఆయన వాట్సాప్లో మెసేజ్ పెట్టారు.