న్యూఢిల్లీ : శ్రీరామ నవమి ఊరేంగింపుల సందర్భంగా పలు రాఫ్ట్రాల్లో జరిగిన అల్లర్లపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. ఈ ఘటనలు దేశంలో భిన్నత్వంలో ఏకత్వమనే సంస్క్రతికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో రామనవమి ప్రదర్శనలు సాగడంపై జిన్నా మనస్తత్వం కలిగిన వారు, ఓవైసీ వంటి వారు విమర్శలు గుప్పించడాన్ని ప్రస్తావిస్తూ రామనవమి ర్యాలీలు భారత్లో కాకుండా పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ఇతర దేశాల్లో నిర్వహిస్తారా అని నిలదీశారు.
1947లో మతపరమైన విభజన జరిగిందని ఆపై అసదుద్దీన్ ఓవైసీ వంటి వారు హిందువుల ఊరేగింపులు ఈ మార్గం గుండా వద్దంటూ దేశాన్ని వారు హిందూ రోడ్లు, ముస్లింల రోడ్లుగా విభజించారని మండిపడ్డారు. ఇలా చీలిక తీసుకువచ్చే వారు పాకిస్తాన్ వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చని హితవు పలికారు. భారత్లో తమ మతపరమైన పద్ధతులు, సంప్రదాయాలపై పరిమితి విధించలేరని స్పష్టం చేశారు.
స్వాతంత్ర్యానంతరం దేశంలో పలు కొత్త మసీదుల నిర్మాణం జరిగినా ఎన్నడూ అభ్యంతరం వ్యక్తం కాలేదని, ముస్లింల జనాభా పలురెట్లు పెరిగిందని అన్నారు. పాకిస్తాన్లో మాత్రం ఆలయాల కూల్చివేత జరుగుతోందని పేర్కొన్నారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని, ఇప్పుడు తమ సహనం నశించిందని బిహార్లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి అన్నారు. కాగా శ్రీరామనవమి సందర్భంగా ఢిల్లీలోని జహంగిర్పురి సహా పలు రాష్ట్రాల్లో శోభాయాత్రల నేపధ్యంలో అల్లర్లు చెలరేగాయి.