న్యూఢిల్లీ, జనవరి 14: వాహనదారుల భద్రత పెంచే చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల కార్లలో 6 ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. త్వరలో అమలులోకి రానున్న ఈ నిబంధనకు సంబంధించిన నోటిపికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా, ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ఆమోదించారు. ముందటి రెండు సీట్లకు ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేసే నిబంధన ఈనెల నుంచే అమలులోకి వచ్చింది. తాజాగా రెండు నుంచి ఎనిమిది సీట్ల వరకు ఉండే రకరకాల కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేసే నోటిఫికేషన్ ముసాయిదాకు తాను ఆమోదముద్ర వేసినట్టు మంత్రి గడ్కరీ ట్విట్టర్లో వెల్లడించారు. అంటే ఎంట్రీ లెవెల్ కారులో కూడా ఆరు ఎయిర్ బ్యాగులు ఇకనుంచి తప్పనిసరి కానున్నాయి. దీంతో కారులో ఎక్కడ కూర్చున్న ప్రయాణికులకైనా భద్రత లభిస్తుంది. అయితే ఇది సులువైన విషయం కాదని కార్ల తయారీదార్లు అంటున్నారు. ఆరు బ్యాగులు అమర్చాలంటే నిర్మాణ వ్యయం పెరుగడంతో కార్ల ధరలు పెరుగుతాయంటున్నారు.