న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం కన్వర్ యాత్రికులపై ప్రజాధనంతో పూల వర్షం కురిపిస్తున్నదని చెప్పారు. మాపై (ముస్లిం) పూల వర్షాలు కురిపించకపోగా, బుల్డోజర్లతో తమ ఇండ్లను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని వర్గాల ప్రజలను ఒకేలా చూడాలని తాము కోరుతున్నామన్నారు.
శివభక్తులు ఏటా కన్వర్ యాత్ర చేస్తారు. గంగా నది నుంచి పవిత్ర జలాన్ని తీసుకురావడానికి కన్వరీయులు ఉత్తరాఖండ్లోని హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి, బీహార్లోని సుల్తాన్గంజ్లను సందర్శిస్తారు. ఈ క్రమంలో కన్వర్ యాత్రికులు యూపీ మీదుగా యాత్ర కొనసాగిస్తున్నారు. దీంతో వారికోసం సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తున్నది. మీరట్ జిల్లాలో ఆదివారం కొందరు అధికారులు కన్వరియాలపై పూల వర్షం కురిపించారు.