శ్రీనగర్: తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడ నుంచి తుడిచిపెట్టుకుపోయిందో ఆ ప్రాంతాల్లో మళ్లీ మిలిటెన్సీ పెరిగిపోతోందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మిలిటెంట్లు బయటి నుండి రాలేదని, కోపం, ఇతర కారణాల వల్ల ఆయుధాలు పట్టేందుకు కశ్మీర్ యువకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దోడాలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడిన ఒమర్, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, అంబానీ, టాటా-బిర్లాలు జమ్ముకశ్మీర్లో పెట్టుబడులు పెడతారని, చాలా ఉద్యోగావకాశాలు సృష్టిస్తాయని కేంద్రం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి రెండేండ్లు అయినా అలాంటిది ఏమీ జరగలేదన్నారు. కనీసం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో కూడా స్థానికులకు ఉపాధి లభించడం లేదని విమర్శించారు.