అమరావతి: విశాఖలో ఆదివారం ప్రతిష్టాత్మక మిలన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరుగనున్నది. ప్రతి రెండేండ్లకు ఒకసారి నిర్వహించే మిలన్ పరేడ్లో భారత నావికాదళ విన్యాసాలు ఉంటాయి. భారత నావికాదళం 11వ ఎడిషన్ విన్యాసాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మిలన్-2022 పరేడ్లో దాదాపు 40 దేశాలకు చెందిన ఓడలు పాల్గొంటున్నాయి. 9 రోజుల పాటు విన్యాసాలు కొనసాగుతాయి.
విశాఖపట్నంలో తొలిసారిగా ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. తూర్పు నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్లో నిర్వహించే మల్టీ లాటరల్ నౌకాదళ విన్యాసాన్ని వీక్షించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. 1995లో అండమాన్ నికోబార్ దీవుల్లో మొదలైన ఈ నౌకాదళ విన్యాసాలు కొనసాగుతున్నాయి.
ఆదివారం నాటి కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ చేరుకుని తొలుత నేవల్ డాక్యార్డ్ని సందర్శిస్తారు. అనంతరం ఇటీవల భారత నావికాదళంలోకి ప్రవేశించిన కల్వరి-క్లాస్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వెలాను చూసేందుకు వెళ్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ సర్క్యూట్ హౌస్కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆర్కే బీచ్కు చేరుకుని ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలాన్– 2022 లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7.15 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం చేరుకుంటారు. ఈ సందర్భంగా అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.