అమాత్యుడు రామన్న చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు
ఆనందంలో 65 మంది లబ్ధిదారులు
జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు
పండుగలా సాగిన మంత్రి కేటీఆర్ పర్యటన
రైతు వేదికలు, అభివృద్ధి పనులు, పెట్రోల్బంక్ ప్రారంభం
జాతీయ పురస్కారాలకు ఎంపికైన సర్పంచులకు సన్మానం
సిరిసిల్ల/ ముస్తాబాద్/ ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 3 : ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన శనివారం ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పండుగలా సాగింది. ఆత్మీయ పలుకరింపులు.. డబుల్ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశం, రైతు వేదికలు, ఇతర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో దాదాపు ఐదు గంటలపాటు కొనసాగింది. ముందుగా ముస్తాబాద్ మండలానికి వచ్చిన అమాత్యుడు మధ్యాహ్నం 12.20 గంటలకు పోత్గల్ సింగిల్విండో ఆధ్వర్యంలో మోహినికుంట పరిధిలోని ముస్తాబాద్-సిద్దిపేట ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు, పోత్గల్ చైర్మన్ తన్నీరు బాపురావుతో కలిసి ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మోహినికుంటలో కేసీఆర్ నగర్లోని డబుల్ బెడ్రూం ఇండ్లను సర్పంచ్ కల్వకుంట్ల వనజతో కలిసి ప్రారంభించారు. ఇండ్లలోకి వెళ్లి లబ్ధిదారులను ఆత్మీయంగా పలుకరించారు. సెల్ఫీలు దిగి, కుశల ప్రశ్నలు అడిగారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
ఇండ్లు పొందిన లబ్ధిదారుల్లో సంతోషం చూస్తోంటే ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. గ్రామాన్ని ఆదర్శంగా నిలిపి, జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా సర్పంచ్ కల్వకుంట్ల వనజతోపాటు పాలకవర్గాన్ని సభావేదికపై సన్మానించారు. మధ్యాహ్నం 1.55 గంటలకు మద్దికుంటలో రైతు వేదికను, 2.50 గంటలకు చీకోడులో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, రైతు వేదికను ప్రారంభించారు. మధ్యాహ్నం 3.12 గంటలకు ముస్తాబాద్లోని రైతువేదికను ప్రారంభించి అక్కడే ప్రసంగించారు. 3.50 గంటలకు ఆవునూర్లో రైతు వేదికను ప్రారంభించి, ఎల్లారెడ్డిపేట మండలానికి వెళ్లారు. 4.24 గంటలకు హరిదాస్నగర్లో గ్రామ కమ్యూనిటీ హాల్ను, శ్మశానవాటికను, పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అక్కడే సర్పంచ్తోపాటు పాలకవర్గాన్ని సన్మానించారు. సాయంత్రం 5.25 గంటలకు తిరుగు పయనమయ్యారు.
ఇవి కూడా చూడండి..
మమతాజీ వారణాసి రండి.. స్వాగతం: మోదీ
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం