న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్పకు (BS Yediyurappa) కేంద్ర హోంశాఖ (MHA) భద్రత కట్టుదిట్టం చేసింది. తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతను (Z category Security) కల్పించింది. దీంతో సీఆర్పీఎఫ్ (CRPF) కమాండోలు ఆయనకు రక్షణ కల్పించనున్నారు. అయితే ఇది కర్ణాటక (Karnataka) వరకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్కు ఆదేశాలు జారీచేసింది.
త్వరలో కర్ణాటక వ్యాప్తంగా పర్యటించనున్న నేపథ్యంలో యెడియూరప్పకు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచడం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపడానికి తాను రాష్ట్రంలో యాత్ర చేపడుతానని మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. తద్వారా రానున్న లోక్సభ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు.