నిజాంసాగర్, జులై 2:నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో సుమారు 1550 మంది నివసిస్తున్నారు. నాడు సమస్యలతో సతమతమైన గ్రామం.. నేడు పల్లె ప్రగతితో సమస్యల్లేకుండా మారింది. రాష్ట్రం ప్రభుత్వం గ్రామాలకు విడుదల చేస్తున్న నిధులతో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించుకొని ఆదర్శంగా నిలుస్తున్నది. మిషన్ భగీరథ పథకంతో తాగునీటి ఇబ్బందులు తీరాయి. ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధమైన నీరు సరఫరా చేస్తున్నారు. రెండున్నరేండ్ల నుంచి సుమారు రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మించారు. ప్రతి ఇంటి ఎదుట మొక్కలు నాటడంతో గ్రామమంతా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ భవనం, ఆలయ కమ్యూనిటీ హాల్ తదితర నిర్మాణాలతో ప్రగతి పరుగులు పెడుతున్నది.
ఆ గ్రామానికి వెళ్లాలంటే కిలోమీటర్ నడవాల్సిందే.. వానకాలం వచ్చిందంటే రోడ్డంతా బురదే.. బిందెడు నీటి కోసం గంటపాటు నల్లా దగ్గర నిలబడాల్సిందే.. చీకటిపడిదంటే రోడ్లన్నీ చిమ్మ చీకట్లే.. ఎటు చూసినా పాడుబడ్డ బావులు.. రోడ్లపై మురికి నీరు.. ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారం.. ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం రెండు కిలోమీటర్లు శవాన్ని మోసుకుపోవడం.. ఇవన్నీ నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలోని ఒకప్పటి సమస్యలు.
నేడు అదే గ్రామ రూపురేఖలు మారాయి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతితో సమస్యలను రూపుమాపుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. ఊరికి రోడ్డు వేశారు.. డ్రైనేజీల నిర్మాణం.. చెత్త సేకరణ..ఇంటింటికీ నల్లాలు.. వీధి దీపాల వెలుగులు.. పాడుబడ్డ బావుల పూడ్చివేత.. రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లతో సుందరంగా దర్శనమిస్తున్నది.
ఊరు మొత్తం మారిపోయింది..
సర్కారు పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టడంతో మా ఊరు మొత్తం మారిపోయింది. ఇప్పటి వరకు మూడు విడుతల్లో పల్లె ప్రగతి పూర్తికాగా ప్రస్తుతం నాలుగో విడుత కార్యక్రమం ప్రారంభించాం. పది రోజుల పాటు రోజుకో కార్యక్రమం నిర్వహించడంతో మిగిలి ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకుంటాం. అంధకారంలో ఉన్న గ్రామంలో సీఎం కేసీఆర్ చొరవతో వెలుగులు విరజిమ్ముతున్నాయి.
-కమ్మరికత్త అంజయ్య, సర్పంచ్ మాగి
అన్ని వసతులతో ముందుకు
గ్రామంలో ఎలాంటి సమస్యల్లేకుండా అన్ని వసతులతో ముందుకు సాగుతున్నాం. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక చొరవ చూపడంతో గ్రామం శుభ్రంగా కనిపిస్తున్నది. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడంతో అభివృద్ధి సాధ్యమైంది.
-లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి