డొమినికాకు చోక్సీ నేరాల వివరాలు పంపిన భారత్
న్యూఢిల్లీ, మే 30: ప్రియురాలితో కలిసి సరదాగా గడుపుదామనుకోవటమే ఆర్థిక నేరస్థుడు మెహుల్ చోక్సీని పోలీసులకు పట్టించిందని తాజాగా వెల్లడైంది. అంటిగ్వాలో రహస్యంగా ఉన్న చోక్సీ.. తన ప్రేయసితో కలిసి ఓ పడవలో డొమినికాకు వెళ్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ వివరాల్ని అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ ఆదివారం వెల్లడించారు. మరోవైపు, చోక్సీ నేరాలకు సంబంధించిన పత్రాలతో భారత్ నుంచి ఓ ప్రత్యేక విమానం డొమినికాకు చేరినట్టు గాస్టన్ బ్రౌన్ ఓ రేడియో షోలో తెలిపారు. అయితే, దీన్ని భారత అధికారులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నుంచి రూ. 13,500 కోట్ల లోన్ తీసుకొని తిరిగి చెల్లించకుండా చోక్సీ పరారీలో ఉండటం తెలిసిందే. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రదారి చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ. భారత్ నుంచి పారిపోయిన చోక్సీ ఇన్నాళ్లు అంటిగ్వాలో తలదాచుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత్ విజ్ఞప్తి మేరకు ఇంటర్పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది. దీంతో ఈ నెల 25న డొమినికా వెళ్లిన చోక్సీని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.