న్యూఢిల్లీ : దేశానికి వచ్చే పర్యాటకుల్లో 50 శాతం మంది మొఘల్ ఆర్కిటెక్చర్ను చూసేందుకు వస్తారని, మరో 50 శాతం మంది కశ్మీర్ను చూసేందుకు వస్తుంటారని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ రెండింటినీ బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆమె ఆరోపించారు.
ఢిల్లీలోని కుతుబ్మినార్ పేరును విష్ణు స్ధంభ్గా మార్చాలని డిమాండ్ చేస్తూ కాషాయ పార్టీ శ్రేణుల నిరసనల నేపధ్యంలో మెహబూబా ముఫ్తీ ఈ వ్యాఖ్యలు చేశారు. మొఘల్ పాలకుల పేరిట ఢిల్లీలో ఉన్న అక్బర్ రోడ్, హుమయూన్ రోడ్, ఔరంగ్ జేబ్ లేన్, తుగ్లక్ లేన్ల పేర్లు మార్చాలని కూడా ఢిల్లీ బీజేపీ కోరుతోంది. ఇక కశ్మీర్లో నెలకొన్న అశాంతి, ఆ ప్రాంతంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల గురించీ మెహబూబ్ ముఫ్తీ ప్రస్తావించారు.
కశ్మీర్ పట్ల భారత ప్రభుత్వం వైఖరి మారాలని కోరారు. కశ్మీరీలపై ఒత్తిడి పెంచుతున్న ప్రభుత్వం హిందూ వర్సెస్ ముస్లింలుగా వివాదాలను ప్రేరేపిస్తూ ఇతర అంశాల నుంచి దారిమళ్లిస్తోందని దుయ్యబట్టారు. చదూరాలో తెహసిల్ధార్ కార్యాలయంలో కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ను ఇటీవల ఉగ్రమూకలు కాల్చిచంపిన నేపధ్యంలో మెహబూబా ముఫ్తీ ఈ వ్యాఖ్యలు చేశారు. భట్ను పొట్టనపెట్టుకున్న మరుసటి రోజే అదే జిల్లాలో పనిచేసే కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్పై గుడూరలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా అతడు ప్రాణాలు కోల్పోయాడు.