న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది గాంధీల దేశం కాదని, గాడ్సేల దేశమని..పాలకులు గాడ్సేల కశ్మీర్ను నిర్మిస్తున్నారని ఆమె ఆరోపించారు. 2019లో రాజ్యాంగవిరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ఆర్టికల్ 370ని రద్దు చేశారని మెహబూబా ముఫ్తీ ఓ వార్తా చానెల్తో మాట్లాడుతూ అన్నారు.
కేంద్ర పాలకులు ఇప్పుడు గాడ్సేల కశ్మీర్ నిర్మాణానికి పూనుకున్నారని దుయ్యబట్టారు. నయా కశ్మీర్ ఆనవాళ్లు ఎక్కడున్నాయని ఆమె ప్రశ్నిస్తూ తన తండ్రి మృతదేహం ఎక్కడుందని ఓ కూతురు నిలదీస్తోందని, ఓ చెల్లి తన అన్న మృతదేహం కోసం వేచిచూస్తోన్న దుర్భర స్ధితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువల గురించి మాట్లాడిన వారిని నిందిస్తున్నారని, ముస్లింలు, చివరికి సినీ స్టార్లనూ తూలనాడే పరిస్ధితి ఉందని వ్యాఖ్యానించారు. భద్రతా దళాల భుజాలపై తుపాకీ ఎక్కుపెట్టి కశ్మీరీల ప్రాణాలు బలిగొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
భద్రతా దళాలను బలిపశువులు చేయకుండా సమస్యల పరిష్కారానికి చర్చలు, సంప్రదింపులతో రాజకీయ ప్రక్రియను చేపట్టాలని ఆమె కోరారు. ఆర్టికల్ 370 ప్రకారం కశ్మీర్లో భూముల క్రయవిక్రయాలు, ఉద్యోగాలు స్ధానికులే చేపట్టాలని, ఇలాంటి నిబంధనలు ఇతర రాష్ట్రాల్లోనూ ఉండగా కశ్మీర్తో సమస్య ఏంటని ఆమె నిలదీశారు. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన కాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసిందని మెహబూబా ముఫ్తీ గుర్తు చేశారు.