శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ను లూటీ చేసేందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుకు పూనుకుందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని దేశ వ్యతిరేక ముద్ర వేసి జమ్ము కశ్మీర్కు చెందిన 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను కేంద్రం తొలగించడాన్ని ఆమె ఆక్షేపించారు. ఆర్టికల్ 370ను దురుద్దేశంతోనే రద్దు చేశారని, కశ్మీర్ను లూటీ చేసేందుకే మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ఆమె మండిపడ్డారు.
చెనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్టుల్లో ఇతర ప్రాంతాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, తమ నీళ్లు, విద్యుత్ను బయటకు తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ట్రాన్స్పోర్టర్లను ఇబ్బంది పెడుతున్నారని టోల్ ట్యాక్స్ సహా పలు పన్నుల భారాలను వారిపై మోపారని పేర్కొన్నారు. కేంద్రానికి ఓ విధానమంటూ లేదని నిరుద్యోగం, ధరలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదరికం తాండవిస్తోందని కేంద్రం అనుసరిస్తున్న దిశాదశా లేని విధానాలతో తమ పరిస్థితి దారుణంగా మారిందని వాపోయారు.