న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం రంగాని( Telecom Sector )కి ఊతమిచ్చే కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర కేబినెట్. 9 నిర్మాణాత్మక సంస్కరణలు, 5 ప్రక్రియ సంబంధిత సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక నుంచి స్పెక్ట్రమ్ యూజర్ ఛార్జ్లను హేతుబద్ధీకరించనుండటం కీలక నిర్ణయాల్లో ఒకటి. అంతేకాకుండా ఇక నుంచి స్పెక్ట్రమ్ను పంచుకోవచ్చు లేదంటే మిగిలిపోయిన స్పెక్ట్రమ్ను తిరిగి అప్పగించవచ్చు. ఇక ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి 100 శాతం ఎఫ్డీలను ఆటోమేటిక్ రూట్లో అనుమతించారు. అంటే టెలికాం రంగంలో ప్రభుత్వ అనుమతి లేకుండానే 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఏర్పడింది. అటు స్పెక్ట్రమ్ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం కూడా విధించింది.
ఈ సంస్కరణలు నిర్మాణాత్మకమైనవి. లోతైనవి, విశాలమైనవి. ఈ మార్పులు ఇవాళ, రేపు, భవిష్యత్తులోనూ మార్పు తీసుకొస్తాయి అని టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఏజీఆర్ హేతుబద్ధీకరణ, భవిష్యత్తు స్పెక్ట్రమ్ వేలంలో పొందే స్పెక్ట్రమ్పై స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జ్లను మాఫీ చేయడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు కేబినెట్ తీసుకుంది. భవిష్యత్తు వేలం కోసం స్పెక్ట్రమ్ కాల వ్యవధిని 20 నుంచి 30 ఏళ్లకు పెంచుతున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఒకవేళ స్పెక్ట్రమ్ను మళ్లీ వెనక్కి ఇవ్వాలనుకుంటే మాత్రం 10 ఏళ్ల తర్వాతే సాధ్యమవుతుంది.