హైదరాబాద్ : జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (NDWA) ఆధ్వర్యంలో సమావేశం గోదావరి (Godavari) – కావేరీ (kaveri) నదుల అనుసంధానంపై ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. జలశక్తి శాఖ, ఎన్డీడబ్ల్యూ, ఐదు రాష్ట్రాలు అధికారులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు. జలశక్తిశాఖ కార్యాలయంలో శ్రమశక్తి భవన్లో సమావేశం జరుగుతుండగా.. 237 టీఎంసీల జలాల తరలింపుపై సమావేశంలో అధికారులు చర్చించనున్నారు. రెండు నదుల అనుసంధానానికి సంబంధించి ఎస్డబ్ల్యూడీఏ సుమారు రూ.75 వేల కోట్ల వ్యయ అంచనాతో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించింది.
సముద్రంలో కలుస్తున్న 247 టీఎంసీల గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టింది. అయితే, మొత్తం ఖర్చులో 90శాతం కేంద్రం, 10శాతం ఖర్చు ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంది. నదుల అనుసంధానం పూర్తయితే తెలంగాణ సుమారు 80 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 90 టీఎంసీలు, పుదుచ్చేరి ఐదు టీఎంసీలు, తమిళనాడు 45 టీఎంసీలు, కర్ణాటక 25 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. రాష్ట్ర అవసరాలు తీరినతర్వాతే నదుల అనుసంధానం ద్వారా నీటిని తరలించడానికి ఒప్పుకుంటామని ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది.