న్యూఢిల్లీ, జనవరి 7: పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ను ఆన్లైన్ విధానంలో మాత్రమే చేపట్టాలని జాతీయ వైద్య కమిషన్ నిబంధనలను జారీ చేసింది. అలాగే కళాశాలలు ముందుగానే ప్రతి కోర్సు ఫీజును ప్రకటించాలని తెలిపింది. 2023లో రూపొందించిన కొత్త నిబంధనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలు మాత్రమే ఆన్లైన్ కౌన్సెలింగ్ చేపట్టాలి. కళాశాలలు సొంతంగా విద్యార్థులను చేర్చుకోకూడదు.
కేవలం ప్రతిభ ఆధారంగానే పీజీ ప్రవేశాలు జరగాలి. ఫీజు వివరాలు ప్రకటించని సీట్లను లెక్కించరు. యూనివర్సిటీ పరీక్ష విధానంలో పార్మేటివ్ అసెస్మెంట్, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణ కోసం డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్లోనూ మార్పులు చేశారు. ఇంతకుముందు 100 పడకల దవాఖానను జిల్లా దవాఖానగా పేర్కొనేవారు. తాజాగా దీనిని 50 పడకలకు తగ్గించారు.
ఒకసారి ఒక వైద్య కళాశాలకు పీజీ కోర్సులు, సీట్లు మంజూరు చేస్తే ఆనాటి నుంచి ఆ కోర్సులను గుర్తింపు పొందినవిగా భావిస్తారు. దీనివల్ల విద్యార్థులు పీజీ పూర్తయ్యాక తమ డిగ్రీలను నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడవు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజీలు మూడో ఏడాది నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభించవచ్చు.
ప్రభుత్వ నిర్వహణలో ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత బోధనేతర దవాఖానలు అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీలు లేకుండానే పీజీ కోర్సులు ప్రారంభించవచ్చు. పీజీ విద్యార్థులందరూ పరిశోధన, నైతిక విలువలు, గుండెపోటును నివారించే నైపుణ్యాల్లో శిక్షణ పొందాలి. ఈ నిబంధనలన్నీ సక్రమంగా అమలు చేసేందుకు జరిమానా విధింపు, సీట్లలో కోత, పూర్తిగా ప్రవేశాల నిలిపివేత వంటి చర్యలు చేపట్టనున్నారు.