ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై తాము అన్ని దేశాల ప్రతినిధులతో టచ్లోనే ఉన్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటు రష్యా.. ఇటు ఉక్రెయిన్తో తాము సంప్రదింపులు జరుపుతూనే వున్నామని, ఇప్పటికే ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడారని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ నుంచి భారత్కు తిరిగి వచ్చే విషయంలో ఇప్పటి వరకూ 20 వేల మంది భారతీయులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అయినా.. మరి కొందరు మిగిలే ఉండిపోయారని ఆయన తెలిపారు. వారు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని, ఇప్పటికీ ఖార్కీవ్లో కొన్ని వందల మంది మాత్రమే ఉండిపోయారని తాము ఓ అంచనాకి వచ్చినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్లో మరణించిన నవీన్ మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, తాము అక్కడి ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని బాగ్చీ వెల్లడించారు.
ఇక.. ఉక్రెయిన్లో ఇరుక్కుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడానికి మరిన్ని విమానాలను ఉపయోగంలోకి తెస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్చీ వెల్లడించారు. మరో రెండు మూడు రోజుల్లోనే అత్యధిక సంఖ్యలో భారతీయులు స్వదేశానికి వచ్చేస్తున్నారని తెలిపారు. భారతీయుల తరలింపులో తమకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం నుంచి భారతీయులను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కీవ్లోని భారత రాయబార కార్యాలయాన్ని ఎల్వీవ్కు తరలించామని అన్నారు. అంతే తప్ప రాయబార కార్యాలయం పూర్తిగా మూసేయలేదని, పూర్తి సమయం రాయబార కార్యాలయం పనిచేస్తోందని అరిందమ్ బాగ్చీ ప్రకటించారు.