Delhi Municipal Elections : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు జరగబోయే ఎన్నికల కోసం 13638 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 68 మోడల్ పోలింగ్ స్టేషన్లు, 68 పింక్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 250 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 1,349 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 1.45 కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీళ్లలో మగ ఓటర్లు 78,93,418, మహిళా ఓటర్లు 66,10,879, ట్రాన్స్జెండర్ ఓటర్లు 1,061 మంది ఉన్నారు. డిసెంబర్ 7వ తేదీని ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఎన్నికల సందర్భంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 5ః30 గంటల నుంచి డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5ః30 వరకు ఒపీనియన్ పోల్స్పై నిషేధం విధించింది. ఢిల్లీలో ఉత్తర, దక్షిణ, తూర్పు మున్సిపల్ కార్పోరేషన్లను విలీనం చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక ఇది. దాంతో, ఈ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి అరవింద్ కేజ్రివాల్కు చెక్ పెట్టాలని బీజేపీ అనుకుంటోంది.