తృణమూల్లో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ పరిస్థితులపై చర్చించారు. పార్టీలో ఒకే వ్యక్తి – ఒకే పదవి అన్న డిమాండ్ను పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ లేవనెత్తారు. దీంతో పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. సీనియర్లు, జూనియర్లుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా 20 మందితో కూడిన ఓ జాతీయ వర్కింగ్ కమిటీని ప్రకటించారు. ఈ సమావేశానికి అభిషేక్ బెనర్జీ కూడా హాజరయ్యారు.
అమిత్ మిత్రా, పార్థా ఛటర్జీ, సుబ్రత బక్షీ, సుదీప్ బందోపాధ్యాయ, అభిషేక్ బెనర్జీ, అనుబ్రతా మండల్, అరూప్ విశ్వాస్, ఫిర్హద్ హకీమ్, యశ్వంత్ సిన్హా తదితరులకు జాతీయ వర్కింగ్ కమిటీలో చోటు దక్కింది. ఈ విషయంపై పార్టీ సీనియర్ నేత పార్థా ఛటర్జీ మాట్లాడుతూ… పార్టీ చైర్పర్సన్గా మమతా బెనర్జీ తిరిగి నియామకం అయిన తర్వాత పార్టీ వ్యవహారాలను చూసుకోవడానికి ఓ చిన్న కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా అధినేత్రి, సీఎం మమత నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు అని పార్థా ఛటర్జీ పేర్కొన్నారు.