Opposition meet | న్యూఢిల్లీ, జూన్ 22 : బీహార్ సీఎం నితీశ్కుమార్ సారథ్యంలో శుక్రవారం పాట్నాలో జరగనున్న విపక్షాల భేటీకి ప్రధాన పార్టీలు హాజరుకాకపోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేడీ, బీఎస్పీతో పాటు రెండు తెలుగు రాష్ర్టాల్లోని బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలను ఆహ్వానించకుండానే సమావేశాన్ని ఏర్పాటు చేయటంపై విస్మయం వ్యక్తమవుతున్నది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న ఆరాటమే తప్ప, విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఆచరణ ఎక్కడా కనిపించడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రధాన పార్టీలను విస్మరించడం వల్ల విపక్షాల ఉమ్మడి లక్ష్యం ఏమేరకు నెరవేరుతుందనే ప్రశ్న తలెత్తుతున్నది. ఆయా పార్టీలు సమావేశానికి ముందే పలు షరతులు విధించడంతో పాటు వారి సొంత ఎజెండాలు, ప్రయోజనాలు పరోక్షంగా బయటపడటం విపక్షాల ఐక్యత అనేది ఆదిలోనే హంసపాదుగా మారిందనే మాటలు వినబడుతున్నాయి.
ఒకవేళ విపక్షాల కూటమి ఏర్పడితే, దీనికి ఎవరు నేతృత్వం వహిస్తారు? ఎవరు సమన్వయం చేస్తారన్నదానిపై సందిగ్ధత నెలకొన్నది. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ప్రధాని అవుతారన్నది కూడా కీలకంగా మారనున్నది. కాగా ఈ భేటీకి ఆర్ఎల్డీ డుమ్మా కొట్టనున్నట్టు తాజా సమాచారం. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే కేజ్రీవాల్ ప్రధాని అవుతారని పాట్నాలో పోస్టర్ వెలువడటం తీవ్ర దుమారం రేపింది. ‘విపక్ష పార్టీల చేతులు మాత్రమే కలుస్తున్నాయి.. మనసులు కలుస్తలేవు, కాబట్టే ఈ కూటమిలో చేరబోం’ అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు.
బీజేపీని ఓడించాలన్న అంశాన్ని వారు సీరియస్గా తీసుకోవటం లేదని ఆమె విమర్శించారు. ‘ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం, అక్షరాస్యత, మత హింస, అణగారిన కులాల పట్ల వివక్ష వంటి సమస్యలను నేడు దేశం ఎదుర్కొంటున్నది. వీటిని రూపుమాపే సామర్థ్యం అటు కాంగ్రెస్కు కానీ ఇటు బీజేపీకి కానీ లేదు’ అని మాయవతి దుయ్యబట్టారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఈ రెండు పార్టీలు నెరవేర్చలేవు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా గొప్ప ఆశయాలతో ఈ భేటీ జరుగుతున్నట్టు కనిపించడం లేదని విమర్శించారు.
దాదాపు 450 లోక్సభ స్థానాల్లో విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని, తద్వారా బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేయవచ్చునని బీహార్ సీఎం నితీశ్కుమార్ విపక్ష నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా హిందీ బెల్ట్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవకుండా ఎలా అడ్డుకోవాలన్నదానిపై చర్చ జరుగుతుందని తెలిసింది. బీజేపీయేతర పార్టీల నాయకులపై ఈడీ, సీబీఐ దాడుల అంశం చర్చకు రానున్నదని సమాచారం.
ఢిల్లీపై కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తేనే విపక్షాల భేటీకి హాజరవుతామని, లేదంటే బాయికాట్ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురువారం ప్రకటించింది. కాగా ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు స్పష్టం చేయకపోవడం గమనార్హం. బెంగాల్లో సీపీఎంతో కాంగ్రెస్ జట్టుకడితే లోక్సభ ఎన్నికలలో తాము ఆ పార్టీకి సాయం చేసేది లేదని మమతా బెనర్జీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తేనే దేశాన్ని కాపాడుకోగలమని అన్నారు. ప్రస్తుతానికి నితీశ్కుమార్ ప్రయత్నాలకు మద్దతు తెలపలేమని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. భేటీకి హాజరుకావటం లేదన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే ధ్యేయంతో ఏకమవ్వాలని ప్రయత్నిస్తున్న విపక్షాల ఐక్యత ఢిల్లీ పాలనాధికారాల ఆర్డినెన్స్పై ఆధారపడి ఉన్నది. పార్లమెంటులో ఈ బిల్లుపై జరగనున్న ఓటింగ్ విపక్షాలకు విషమ పరీక్ష లాంటిదని చెప్పవచ్చు. బిల్లును వ్యతిరేకించాలని అన్ని పక్షాల మద్దతు కూడగడుతున్న ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ మద్దతును మాత్రం పొందలేకపోయారు. దీంతో ఈ బిల్లు అంశంలో తమకు మద్దతిస్తేనే శుక్రవారం జరగనున్న విపక్షాల సమావేశానికి హాజరవుతానని కేజ్రీవాల్ అల్టిమేటం జారీ చేశారు. దీన్నిబట్టే అర్థమవుతున్నది… విపక్షాల ఐక్యత ఆర్డినెన్స్ బిల్లుపై ఆధారపడి ఉన్నదని. లోక్సభలో అధికార బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నది. దీంతో కేజ్రీవాల్ ఈ బిల్లును అడ్డుకునేందుకు రాజ్యసభను ఎంచుకున్నారు.
ఢిల్లీ, పంజాబ్లో తమ ప్రభుత్వాలను గద్దె దించి అధికారంలోకి వచ్చిన ఆప్కు ఏ విషయంలోనూ మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సుముఖంగా లేరని తెలుస్తున్నది. గుజరాత్, గోవాలో ఓటమికి ఆప్ కారణమని వారు భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై మల్లగుల్లాలు పడుతున్నది. కానీ ఈ బిల్లు విషయంలో ఆప్కు ముఖం చాటేస్తే… రానున్న ఎన్నికల్లో విపక్ష కూటమి ఐక్యతపై నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉన్నది.
ప్రస్తుతం రాజ్యసభలో 238 మంది సభ్యులున్నారు. ఎన్డీఏ కూటమికి 109 మంది ఎంపీలున్నారు. కాంగ్రెస్కు 31 మంది సభ్యులు ఉన్నారు. ఇతర విపక్ష పార్టీలకు చెందిన 70 మంది సభ్యుల మద్దతును ఆప్ కూడగట్టింది. బిల్లును అడ్డుకోవాలంటే ఈ సంఖ్య సరిపోదు. కాంగ్రెస్ మద్దతు లేకుండా బిల్లును అడ్డుకోవడం అసాధ్యం. ఒకవేళ కాంగ్రెస్ ఓటింగ్లో పాల్గొనకుండా వాకౌట్ చేస్తే 109 ఎంపీలతో అధికార బీజేపీ సునాయాసంగా గట్టెక్కుతుంది. విపక్ష పార్టీలు ఆప్ (10), టీఎంసీ (12), డీఎంకే (10), బీఆర్ఎస్ (7), ఆర్జేడీ (6), సీపీఐ(ఎం) (6), జేడీయూ (5), ఎన్సీపీ (4), శివసేన -యూబీటీ (3), ఎస్పీ (3), సీపీఐ (2), జేఎంఎం (2), ఐయూఎంఎల్, ఆర్ఎల్డీ నుంచి ఒక్కో సభ్యులు ఆప్కు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా విపక్ష సభ్యుల సంఖ్య వంద మాత్రమే ఉంటుంది. దీంతో తటస్థంగా ఉన్న బీజేడీ (9), వైసీపీ (9)ల మద్దతు ఎంతో కీలకంగా మారింది. ఎన్నికల వేళ పార్లమెంట్ ముందుకురానున్న ఈ బిల్లుపై జరగనున్న ఓటింగ్తోనే విపక్ష కూటమి ఐక్యత తేలిపోనున్నది.