లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్ధాపన చేసిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. యూపీలో మౌలిక వసతులను గత పాలకులు నిర్లక్ష్యం చేశారంటూ ప్రధాని మోదీ విపక్షాలకు చురకలు వేయగా బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తన హయాంలో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును అప్పటి యూపీఏ ప్రభుత్వం అడ్డుకుందని ఆమె ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ దాదాపు పదేండ్ల పాటు ఈ ప్రాజెక్టును తొక్కిపెట్టిందని అన్నారు. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి బీజేపీ శంకుస్ధాపన చేసిందని ఇది ప్రచారార్భటమేనని మాయావతి మండిపడ్డారు. ఇక నోయిడా ఎయిర్పోర్ట్తో యూపీలో మౌలిక సౌకర్యాలు మెరుగుపడి యువతకు ఉపాధి అవకాశాలు అందివస్తాయని యూపీ లాజిస్టిక్స్ హబ్గా ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.