లక్నో: తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati ) స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ప్రతిపక్షాల కూటమి ఇండియా బ్లాక్కు పూర్తిగా దూరమని మరోసారి పునరుద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అయిన మాయావతి ఈ మేరకు ఆదివారం ప్రకటించినట్లు ఆ పార్టీ పేర్కొంది. రాబోయే లోక్సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో పార్టీ సంసిద్ధత గురించి సీనియర్ నేతలతో ఆమె చర్చించినట్లు తెలిపింది. ‘అధికార ఎన్డీఏ, ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమికి పూర్తి దూరం కొనసాగిస్తూనే పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేయాలని పార్టీ నేతలకు మాయావతి మరోసారి స్పష్టం చేశారు’ అని బీఎస్పీ పేర్కొంది.
కాగా, బీజేపీ కొత్త ఎన్నికల వ్యూహం గురించి కూడా పార్టీ సమావేశంలో మాయావతి ప్రస్తావించారు. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, ఆదాయం తగ్గుదల, రోడ్ల అధ్వాన్న స్థితి, శాంతిభద్రతలు, ఆరోగ్యం, విద్యారంగంలో సమస్యలను ప్రజలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రజాప్రయోజనాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాల విషయానికి వస్తే బీజేపీ, కాంగ్రెస్ల వైఖరి దాదాపు ఒకే విధంగా ఉందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ప్రజా వ్యతిరేకమని మాయావతి దుయ్యబట్టారు. అలాగే తప్పుడు వార్తలు, రాజకీయ కుట్ర పూరిత ప్రచారాల పట్ల అలెర్ట్గా ఉండాలని పార్టీ క్యాడర్కు ఆమె సూచించారు.