న్యూఢిల్లీ : కాన్పూర్ వ్యాపారి మనీష్ గుప్తా గోరఖ్పూర్ హోటల్లో బసచేయగా పోలీసులు జరిపిన దాడిలో మరణించిన ఘటనపై విచారణ జరిపించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కేసులో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసినా ఇంతవరకూ అరెస్ట్లు జరగకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం పెల్లుబికినా వీరిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోవడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయని మాయావతి, అఖిలేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటన పట్ల యోగి ఆదిత్యానాధ్ అలక్ష్యం వహిస్తుండటంతో ప్రభుత్వ విధానాలు, ఉద్దేశంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. తక్షణమే వ్యాపారి హత్యోదంతంపై సీబీఐ విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు యూపీ పోలీసులు క్రిమినల్స్ పట్ల మెతక వైఖరి అవలంభిస్తూ సామాన్య ప్రజలపై విరుచుకుపడుతున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు.