లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో జరిగిన టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ బాధిత అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని లక్నోలోని ఎకో గార్డెన్లో 526 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే అభ్యర్థుల ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విజయ్కుమార్ అనే అభ్యర్థి మాట్లాడుతూ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేయాలని డిమాండ్ చేశారు. 2021, ఏప్రిల్ 19న కమిషన్ ఇచ్చిన నివేదికలో 69 వేల మంది టీచర్ల రిక్రూట్మెంట్లో రిజర్వేషన్ స్కామ్ జరిగినట్టు నిర్ధారించిందని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా పంపిందని పేర్కొన్నారు. కుంభకోణం కారణంగా ప్రభావితమైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలని కూడా సూచించిందని అన్నారు. అయితే దీన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. రిజర్వేషన్లలో వ్యత్యాసాల కారణంగా నష్టపోయిన దాదాపు 6,800 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేయడం లేదని మండిపడ్డారు.
69 వేల పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2019, జనవరిలో అసిస్టెంట్ టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్ష(ఏటీఆర్ఈ)ను నిర్వహించింది. జనరల్ అభ్యర్థులకు 65 శాతం, ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 60 శాతం మార్కులను కటాఫ్గా నిర్ణయించింది. ఫలితాల ప్రకటన తర్వాత ప్రభుత్వం తీసుకొన్న రిజర్వేషన్ ప్రమాణాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపిస్తూ రిక్రూట్మెంట్ ప్రక్రియకు వ్యతిరేకంగా అభ్యర్థులు 2020, మేలో ఆందోళనలు చేశారు. దీనిపై ప్రభుత్వం వేసిన కమిషన్ దర్యాప్తులో కూడా ఇదే తేలింది. వ్యత్యాసాలను అంగీకరించిన ప్రభుత్వం.. అభ్యర్థుల డిమాండ్ మేరకు 2022, జనవరిలో 6,800 మంది జాబితాను విడుదల చేసింది. అయితే నియాయకాలు మాత్రం చేపట్టలేదు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ నియామక ప్రక్రియ ఆగిపోయింది.
మరోవైపు యోగి సర్కార్ రాష్ట్రంలో ఖాళీల ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో అలసత్వం వహిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ప్రాథమిక విద్య, పోలీసు శాఖ, తదితర విభాగాల్లో దాదాపు 6 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయాలని గత కొన్నేండ్లుగా యువత డిమాండ్ చేస్తున్నది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో యువ మంచ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశమైంది. సోషల్ మీడియా ద్వారా ఉద్యోగాల భర్తీ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. అదేవిధంగా ఈనెల మొదటి వారంలో ఆందోళన నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకొన్నారు. 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామనే హమీని ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇవ్వాలని యువ మంచ్ డిమాండ్ చేసింది. అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జిని కూడా ఖండించింది.