న్యూఢిల్లీ, జూన్ 4: బీజేపీపై తరుచూ విమర్శలు చేసే ఆ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షా కుమారుడు జయ్ షా బీసీసీఐపై ఒక నియంతలా పెత్తనం చెలాయిస్తున్నందు వల్ల ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలాంటి దర్యాప్తు చేబట్టబోదని తెలిపారు. అందుకే దీనిపై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సిన అవసరమున్నదని నొక్కి చెప్పారు. ఈసారి ఐపీఎల్ టైటిల్ను గుజరాత్ టైటాన్స్ నెగ్గిన విషయం తెలిసిందే.
జమ్ముకశ్మీర్లో పండిట్లు, హిందువుల హత్యాకాండపై కూడా స్వామి ఇటీవల స్పందించారు. పండిట్ల హత్యలను నిలువరించడంలో షా విఫలమయ్యారని మండిపడ్డారు. హోంశాఖ కంటే క్రీడాశాఖ ఆయనకు బాగా సెట్ అవుతుందని ఎద్దేవా చేశారు. జ్ఞానవాపీ మసీదు వివాదం గురించి ప్రస్తావిస్తూ.. మసీదు అంశానికి సంబంధించి షా అనవసరంగా తప్పుడు అంచనాలను పెంచుతున్నారని మండిపడ్డారు. 1991 చట్టానికి కట్టుబడి అందరూ ఉన్నప్పుడూ.. ఇలాంటి చర్యలు మంత్రికి తగవని హితవు పలికారు.