న్యూఢిల్లీ, మే 12: ఓడిపోయే ప్రాంతాల్లో ఎలాగైనా పార్టీ గెలవాలి. దానికోసం ప్రజాధనం ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎలాగో అధికారంలో మనమే ఉన్నాం. ఏదో ఓ స్కీమ్ పేరుతో ఖజానా నుంచి కోట్ల రూపాయాలు విడుదల చేస్తాం. పార్టీకి వ్యతిరేక పవనాలు ఉన్నచోట ఆ డబ్బును ఖర్చుచేయండి. అలాగే, పార్టీ సానుభూతిపరులకు ఆర్థిక సాయాన్ని అందించండి. లోక్సభ ఎన్నికలు జరిగేలోపు ఈ తంతు పూర్తిచేయాలి.. రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తామంటూ ప్రధాని మోదీ 2019లో ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ స్కీమ్ వెనుక జరిగిన అసలు తతంగం ఇది.
ఎన్నికల ముందు కథ షురూ
2019 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా పోలింగ్ జరుగడానికి సరిగ్గా మూడు నెలల ముందు ప్రధాని మోదీ సర్కారు పీఎం కిసాన్ స్కీమ్ను తీసుకొచ్చింది. తక్కువ సమయంలో ఎక్కువమందిని లబ్ధిదారులుగా చూపించడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి.. అనర్హులు, బీజేపీ సానుభూతిపరులను అర్హులుగా చిత్రీకరించింది. దీనికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి వార్డు మెంబర్ల వరకూ తలా ఓ చేయి వేశారు. ఇలా 2019-2021 మధ్య పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఏకంగా రూ. 3 వేల కోట్ల కుంభకోణానికి బీజేపీ సర్కారు పాల్పడింది. ఈ విషయాలను ఇంగ్లిష్ వెబ్సైట్ ‘స్క్రోల్’ వెలుగులోకి తీసుకొచ్చింది.
వ్యవసాయ మంత్రే ఒప్పుకొన్నారు
‘అర్హత లేకపోయినప్పటికీ, 42.16 లక్షల మంది పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు గుర్తించాం. వీరి నుంచి రూ. 2,992.75 కోట్లు రికవరీ చేయాల్సి ఉన్నది. అత్యధికంగా అస్సాం నుంచి రూ. 500 కోట్లను రికవరీ చేయాలి’
-జూలై 20, 2021న పార్లమెంట్లో వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్