దేశమంతా ఆర్మీ ఉద్యోగార్థుల నిరసనజ్వాల
భవిష్యత్తుకు భరోసా కల్పించని స్కీమ్పై కన్నెర్ర
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆందోళనలు
పది రాష్ర్టాల్లో నిరసనలు.. రైళ్లు దగ్ధం, రోడ్ల దిగ్బంధం
బీహార్లో మూడు రైళ్లతోపాటు బస్సులకు నిప్పు
పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయు గోళాల ప్రయోగం
వెనక్కి తగ్గని యువత.. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు
స్కీమ్ వెనక్కి తీసుకొనేవరకూ పోరాటం ఆగదని వెల్లడి
ఓవైపు ఆజాదీ అమృత్ ఉత్సవాలు జరుపుకొంటున్నాం.. మరోవైపు ఇంటాబయటా పెను వివాదాల అశాంతి.. కల్లోలాలతో దేశం అట్టుడుకుతున్నది. అంతర్జాతీయంగా అనేక దేశాల్లో భారత పరువు మంటగలుస్తున్నది. సన్నిహిత వ్యాపారవేత్తల ప్రయోజనాలను కాపాడటానికి.. మోదీ సర్కారు దుందుడుకు పనులు దేశానికి తలవంపులు తెస్తున్నవి.
వివాదంలో వ్యవసాయం.. రైతుల్లో ఆందోళన
అమ్మకానికి ప్రభుత్వ రంగం.. ఉద్యోగుల్లో సంక్షోభం
దర్యాప్తు సంస్థల దుర్వినియోగం.. విపక్షాల నేతలపై దాడులు
న్యాయవ్యవస్థపై పరోక్ష దాడి.. కోర్టులను ప్రభావితం చేసే నీతి
అదాలత్లను ధిక్కరించి.. శాసన వ్యవస్థల బుల్డోజర్ న్యాయం
భయంకరమైన ధరలు.. దేశ ప్రజల హాహాకారాలు
పతనావస్థలో ఆర్థికం.. రూపాయి పతనం.. పెరిగిన ద్రవ్యోల్బణం
మనం ఎటువైపు పోతున్నాం?.. మనకు ఏమిటీ దురవస్థ?
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా గురువారం బీహార్లోని ఛాప్రాలో నిరసనకారులు నిప్పుపెట్టడంతో కాలిపోతున్న రైలు
బీహార్లోని కైమూర్ జిల్లాలో ఉన్న భబువా రైల్వేస్టేషన్ పట్టాలపై నిరసన
న్యూఢిల్లీ, జూన్ 16: కేంద్రంలోని మోదీ సర్కారు ఏకపక్ష నిర్ణయాలపై యువత కన్నెర్రజేసింది. సాయుధ దళాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకోవడానికి తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ స్కీమ్పై ఆర్మీ ఉద్యోగార్థులు భగ్గుమన్నారు. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించని ఈ స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యువజనం చేపట్టిన నిరసన ప్రదర్శనలతో యావత్తు దేశం అట్టుడికిపోయింది. ఆందోళనల్లో పలు బస్సులు, రైళ్లు దగ్ధమయ్యాయి. నిరసనకారులు రోడ్లను దిగ్బంధించడంతో జాతీయ రహదారులపై భారీయెత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. 34 రైళ్లు రద్దయ్యాయి. పదుల సంఖ్యలో రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
భగ్గుమన్న బీహార్
‘అగ్నిపథ్’ స్కీమ్ను వ్యతిరేకిస్తూ బీహార్లోని పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పథకానికి వ్యతిరేకంగా ఉదయం నుంచే పలు ప్రాంతాల్లోని రహదారులను, రైల్వే ట్రాక్లను దిగ్బంధించిన నిరసనకారులు టైర్లను తగులబెట్టారు. దీంతో పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఆగ్రహించిన ఆందోళనకారులు భభువా, చప్రా, బక్సర్ తదితర రైల్వే స్టేషన్లలో నిలిచిఉన్న డజనుకు పైగా రైళ్లను ధ్వంసం చేశారు. మూడు రైళ్లకు నిప్పు పెట్టారు. స్టేషన్లలోని సామగ్రిని ధ్వంసం చేశారు. పలు బస్సులను సైతం ధ్వంసం చేసి దగ్ధం చేశారు. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. నవాడాలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే అరుణ దేవి కారుపై నిరసనకారులు రాళ్లతో దాడికి దిగారు. ఎమ్మెల్యేతో సహా మరో ఐదుగురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పట్టణంలోని బీజేపీ కార్యాలయాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
దద్దరిల్లిన ఢిల్లీ, హర్యానా
అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ వందలాదిమంది నిరసనకారులు ఢిల్లీలోని నంగ్లోయి రైల్వే స్టేషన్ను ముట్టడించారు. ట్రాక్లపై కూర్చొని రైల్రోకో నిర్వహించారు. గురుగ్రామ్-జైపూర్ హైవేను దిగ్బంధించారు. హర్యానాలోని గురుగ్రామ్, పాల్వాల్, బిలాస్పూర్, సిద్రావాలీ, రెవారీ తదితర ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించి ఆందోళనలు చేపట్టారు. దీంతో జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పాల్వాల్లో ఆగివున్న ఓ పోలీసు వాహనంపై నిరసనకారులు రాళ్లతో దాడి చేశారు. పట్టణంలో ఫోన్ ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సర్వీసులను 24 గంటలపాటు రద్దు చేశారు.
హిమాచల్లో మోదీకి వ్యతిరేకంగా..
హిమాచల్లోని ధర్మశాలకు రెండురోజుల పర్యటన నిమిత్తం గురువారం ప్రధాని మోదీ వస్తున్నారని తెలియడంతో ఆర్మీ ఉద్యోగార్థులు ఉదయమే కాంగ్రా విమానాశ్రయానికి చేరుకొన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శించారు. ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
హోరెత్తిన యూపీ, జమ్ము
స్కీమ్కు వ్యతిరేకంగా యూపీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తాయి. ఆగ్రాలోని ఓ ప్రభుత్వ బస్సుపై నిరసనకారులు రాళ్లతో దాడి చేశారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. బులంద్షహర్, బల్లియాలో రోడ్లపై ఆందోళనలకు దిగారు. జమ్ములోని ప్రెస్ క్లబ్ ఎదుట ఉద్యోగార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడులోనూ..
‘అగ్నిపథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ రాజస్థాన్లోని జోధ్పూర్, శికార్, జైపూర్, నాగౌర్, అజ్మీర్, ఝౌంజౌ తదితర జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. జైపూర్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్మాకు దిగిన ఆర్మీ ఉద్యోగార్థులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమిళనాడులోని వెల్లూర్తో పాటు ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.
లోపాల పుట్ట ‘అగ్నిపథ్’
కార్గిల్ యుద్ధ వీరుడు జనరల్ జీడీ బక్షీ
‘అగ్నిపథ్’ స్కీమ్పై రిటైర్డ్ మేజర్ జనరల్, కార్గిల్ యుద్ధ వీరుడు జీడీ బక్షీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానం కారణంగా మంచి కంటే చెడు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు హెచ్చరిస్తూ.. ‘అగ్నిపథ్’ పాలసీలోని లోపాలను వివరించారు. అవి..
అప్పుడు రైతులు.. ఇప్పుడు యువకులు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సాగుచట్టాల వల్ల రైతులు 13 నెలలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ‘అగ్నిపథ్’ తప్పుడు నిర్ణయం వల్ల లక్షలాది మంది యువకులు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్మీ అభ్యర్థులు కూడా అన్నదాతల బిడ్డలే. వాళ్లకు న్యాయం జరిగేంతవరకూ పోరాడుతాం. దేశవ్యాప్త ఉద్యమానికి సమయం ఆసన్నమైంది.
–బీకేయూ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయిత్
అనవసర భారమే
‘అగ్నిపథ్’ అనవసర భారమే. ఈ పథకంపై అనేక సందేహాలున్నాయి. నాలుగేండ్ల తర్వాత 75 శాతం అగ్నివీరులు ఎలాంటి పింఛను లేకుండా రిటైర్ అవుతారు. ఏటా నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. కేవలం 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే తీసుకుంటాం అంటున్నారు. అప్పుడు మిగతావారి శిక్షణకు పెట్టిన ఖర్చు వృథా అయినట్లే కదా!
-బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ
అగ్నిపరీక్ష పెట్టొద్దు
నో ర్యాంక్-నో పెన్షన్. నాలుగేండ్ల తర్వాత యువత భవిష్యత్తుకు భరోసా లేదు. ‘అగ్నిపథ్’ వంటి పథకాలను తీసుకొచ్చి నిరుద్యోగుల సహనానికి అగ్నిపరీక్ష పెట్టొద్దు. సైన్యంపై కేంద్రప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం లేదు.
–కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ
అసంతృప్తిలో యువత
నాలుగేండ్లు కాకుండా జీవితాంతం దేశానికి సేవ చేసే అవకాశాన్ని కేంద్రం యువతకు కల్పించాలి. కరోనా వల్ల ఆర్మీ రిక్రూట్మెంట్ నిలిచిపోయింది. ఇప్పటికైనా ఆ ఉద్యోగాల భర్తీ చేపట్టాలి.
– ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
అగ్గిలో దూకే విధంగా..
‘అగ్నిపథ్’ అగ్గిలో దూకే విధంగా ఉండకూడదు. దేశ భద్రత షార్ట్ టర్మ్ కోర్సు కాదు. యువత, దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా ఈ స్కీమ్ కనిపిస్తున్నది.
– ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
వెంటనే వెనక్కి తీసుకోవాలి
జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ‘అగ్నిపథ్’ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. దీనిపై పార్లమెంట్లో చర్చించాలి. సాయుధ దళాల ైస్థెర్యాన్ని కాలరాస్తూ వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
– వామపక్షాలు
వయసు పరిమితి 21 నుంచి 23కు పెంపు
సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటంతో ‘అగ్నిపథ్’ స్కీమ్లో కేంద్రం స్వల్ప సవరణ చేసింది. అభ్యర్థుల గరిష్ఠ వయసును 21 ఏండ్ల నుంచి 23 ఏండ్లకు పెంచింది. అలాగే, తాజా పథకంతో అగ్నివీరులకు వచ్చే నష్టమేమీలేదని చెప్పుకొచ్చింది. నాలుగేండ్ల సర్వీసు పూర్తయ్యాక, ప్రభుత్వం ఇచ్చే రూ. 11.71 లక్షలతో అగ్నివీరులు వ్యాపారం ప్రారంభించి నిలదొక్కుకోవచ్చని వివరించింది. అయితే, కేంద్రం వివరణపై పలువురు మండిపడుతున్నారు.