డెహ్రాడూన్, ఆగస్టు 29: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో స్కామ్ల మీద స్కామ్లు బయటపడుతున్నాయి. సబ్ఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ చేపట్టిన నియామకాల్లో అవకతవకలపై ఓవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే.. శాసనసభలో నియామకాలకు చేపట్టిన రిక్రూట్మెంట్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు తాజాగా సంచలనంగా మారాయి. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపింది. మంత్రి ప్రేమ్చంద్ అగర్వాల్ స్పీకర్గా ఉన్న సమయంలో అసెంబ్లీ యంత్రాంగం చేపట్టిన నియామకాల్లో పెద్దయెత్తున అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. రాజకీయ నేతల బంధువులు, సన్నిహితులకు ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నది. ఈ రిక్రూట్మెంట్ స్కామ్పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేసింది. స్పీకర్గా ప్రేమ్చంద్ అగర్వాల్ హయాంలో చేపట్టిన 74 నియామకాలకు సంబంధించిన జాబితా ప్రసుత్తం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. ఈ స్కామ్లో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శనివారం శాసనసభ ముందు ధర్నా నిర్వహించింది. ఆరోపణలపై అగర్వాల్ స్పందిస్తూ నియామకాల్లో ఎటువంటి అక్రమాలు జరుగలేదని చెప్పుకొచ్చారు. కాగా, ఇటీవల సబ్ఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు బయటపడడంతో అన్ని పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.