న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోహిణి సెక్టార్-5లోని పూత్ కలాన్ ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురిని రక్షించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి.. గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
సమాచారం ప్రకారం.. రోహిణి సెక్టార్-5లోని పూత్ కలాన్ ప్రాంతంలోని రెండంతస్తుల భవనంలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే అగ్నికీలలు ఎగిసిపడి భవనం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మంటల్లో చిక్కుకున్నది. పలువురు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భవనంలో చిక్కుకున్న ఆరుగురిని రక్షించగా.. ఒకరు మరణించారు. సాయంత్రం 4.55 గంటల సమంలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిందని ఫైర్ అధికారులు తెలిపారు.