ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంధేరి ప్రాంతంలోని చిత్రకూట్ స్టూడియోలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్ధలానికి ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు, రెండు వాటర్ ట్యాంకర్లు చేరుకున్నాయి. ఈ స్టూడియోలోనే రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్లపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. స్టూడియోలో అగ్నిప్రమాదంలో మూవీ సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. స్టూడియోకు సమీపంలోని డీఎన్ నగర్ ప్రాంతంలోని భవనంలో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని షాపులో అగ్నిప్రమాదం జరగ్గా మంటలు వ్యాపించాయని తెలిసింది. అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.