Earthquake | ఏ క్షణంలోనైనా హిమాలయ పర్వత శ్రేణుల పరిధిలో భారీ భూకంపం సంభవించే ప్రమాదం పొంచి ఉందని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చి (ఎన్జీఆర్ఐ) అంచనా వేసింది. ఈ భూకంపం వల్ల సమీప భవిష్యత్లో ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలతోపాటు నేపాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఎన్జీఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు మంగళవారం మీడియాకు చెప్పారు. శక్తిమంతమైన కట్టడాల వల్ల ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తుందని, దీన్ని నివారించాల్సి ఉందన్నారు.
వివిధ ఫలకాల పరిధిలో భూమి ఉపరితలం కదులుతున్నదని పూర్ణచంద్రరావు తెలిపారు. ప్రతియేటా భారత ఫలకం ఐదు సెంటీమీటర్లు కదులుతున్నదని చెప్పారు. ఇది హిమాలయ పర్వత శ్రేణులపై ఒత్తిడి పెంచిందన్నారు.
`ఉత్తరాఖండ్ పరిధిలో 18 సిస్మోగ్రాఫ్ స్టేషన్ల నెట్వర్క్ మాకు ఉంది. హిమాచల్ ప్రదేశ్-నేపాల్-ఉత్తరాఖండ్లోని పశ్చిమ ప్రాంతాల మధ్య భౌగోళిక అంతరాయం ఏర్పడిందని నివేదికలు అందాయి. ఏ క్షణంలోనైనా భూకంపం సంభవించవచ్చు` అని పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ భూకంపాలు రిక్టర్ స్కేల్పై 8గా నమోదు కావచ్చునని అంచనా వేశారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూకంపం సంభవిస్తే, ఇటీవల టర్కీలో జరిగిన భూకంపం స్థాయిలో నష్టం జరుగవచ్చుననని పూర్ణచంద్రరావు అంచనా వేశారు. `భూకంపాలను మనం నిలువరించలేం. నష్టాన్ని నివారించగలం. భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో భవనాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు ఈ మార్గదర్శకాలు అనుసరించాలి` అని సూచించారు.